కీలు గుర్రము
అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు; ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడుకాదు. పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా.
ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవనంగా పీర్లపండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశ దేశాలనుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమతమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు.
ఒకయేడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే, ముసలితాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కడలేని నవ్వు వచ్చింది.
“ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా.” అని అడిగాడు ఒక శిల్పి.
“బలే గుర్రం తాతయ్యా, ఎంత కిస్తావు?” అని వెక్కిరించాడు మరొక శిల్పి.
“ఏమిగుర్ర మనుకున్నా వేమిరా అది దేవతా గుర్రం.” అన్నాడు మరొక శిల్పి.
“వాళ్లతో నీకెందుకుకాని దీన్నిఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్యా.” అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి.
తాతకు కోపం వచ్చింది. “మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకు వచ్చిన బాధ? పొండి, పొండి.” అని కసీరాదు.
నవాబు శిల్చులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానమిచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలి౦ది. “ఏమిటి దీని విశేషం.” అని అడిగాడు నవాబు.

“ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపులగుర్రంకాదు.
కీలుగుర్రం. ఇది “కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసివస్తుంది ఆకాశం అంతు కనుక్కొస్తుంది.” అన్నాడు ముదివగ్గు.
“టట్ టట్! అంతా అబద్ధం. అలాంటిది భూలోకంలో ఉండదు.”అన్నాడు నవాబు.
“ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను,” అన్నాడు శిల్పి.
“ఇక్కడికి పదికోసుల దూరంలో చందనపర్వతం ఉంది. దానిమీద మసీదు. మసీదు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను.” అన్నాడు నవాబు.
ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర మెక్కి ఏదో బుడుపు లాగావున్న మీట నొక్కాడు, గుర్రం ఆగమేగాలమీద లేచింది. అది ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. నవాబు తెప్పరిల్లి చూచేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు.
నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించా లనిపించింది. “నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో. నాకా కీలుగుఱ్ఱం మాత్రం యివ్వు.” అన్నాడు.
“అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్ళిచెయ్యండి.” అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి మూడుకాళ్లముసలి. అందులో పగలుచూస్తే రాత్రి కలలోకి వస్తాడు. అలాంటివాడికి చూస్తూ చూస్తూ, చక్కనిచుక్క, పదహారేళ్ళ బాలను ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించ సాగాడు/
నవాబుకొడుకు పిరోజిషా అన్నాడు: “నీవు గారడి చేశావో లేక, ఆ గుర్రానికి ఆ శక్తి వుందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో. నిజం తెల్సుకోకుండా ఎలా తీసుకోవటం? నేను పరీక్షిస్తా” అని.
ఫిరోజిషా కీలుగుర్ర మెక్కి మీట నొక్కాడు. ఆది రివ్వున లేచి, చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు, అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు, ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ కూచున్నారు. మధ్యాహ్నమైంది. ఆచూకిలేదు. సాయంత్ర మైంది, అయిపులేదు, ప్రొద్దుగూకింది. ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తనకొడుకు యిలా అయ్యేవాడు కాదుగా, “వీణ్ణి తీసుకెళ్ళి చెరశాలలో పడెయ్యండి, తరువాత చూద్దాము” అన్నాడు. నవాబు భటులు శిల్పిని తీసుకెళ్ళి చెరశాలలో తోశారు.
ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రం మీద వాయువేగంతో పైకిలేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానోనని క్రిందికి చూచాడు మనుషులు కనిపించలేదు. చెట్లు కనిపించలేదు. తనకోట కనిపించలేదు. చందనగిరి మాత్రం చిన్ని పుట్టలాగా కనిపించింది. దానితో
అతనికళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గటిగా పట్టుకొన్నాడు. అది ఆగకుండా పైకి పోతూ వుంది.
ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజూ తనతో ఆడుతూ పొడుతూ వుండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ

ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకొన్నాడు. గుర్రం వాయువేగంతో పోతూనే వుంది.
ఇలా కొంతసేపు పోగాపోగా ఫిరోజిషాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని క్రిందికి దించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొకమీట ఉ౦డితీరాలనుకొన్నాడు. జూలులో వెదికాడు, కనిపించలేదు. జీనుపక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు, లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని రెండు చెవులు పట్టుకొన్నాడు. గుర్రం వేగం తగ్గి మెల్లగా క్రిందికి దిగ సాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదుటపడ్డాయి.
గృురప్పచెవులు రండు ఇంకా గట్టిగా వెనకకు లాగాడు. చర్రున అది కిందికి దిగసాగింది. అలా దిగిదిగి చివరికి ఒక ఏడు అంతస్థుల మేడమీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణమంతా మాటుమణిగివుంది.

పిరోజిషా మెట్లు దిగి ఏడో అంతన్థు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్నిబట్టి వెళ్లాడు. మరకత మాణిక్యాలతో ధగధగ మెరుస్తూ వుంది, ఒక పెద్దగది. లోపలి కెళ్లాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పంమీద రాజకుమార్తె పండుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపోతున్నారు. ఫిరోజిషా తనకళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో ననుకొన్నాడు, తనవొల్లు తాను గిచ్చుకొన్నాడు. బాధ తెలుస్తూనే వుంది. అప్పు డదంతా నిజమని అనుకున్నాడు.
మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్కలమధ్య చంద్రుడిలాగా వుంది. బంగారపుజుట్టు, తళతళా మెరుస్తూవుంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళువిప్పి అతన్ని చూచింది.
ఫిరోజిషా ఆమెను ప్రక్కకు తీసుకెళ్లి తన కధంతా చెప్పాడు. తనతో పర్షియాకువచ్చి – తన్ను పెండ్లాడ వలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. రెండోవారికి చెప్పకుండా అతనివెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణంముందు వాలారు.

మేళతాళాలు, బాజాభజంత్రీలు లేకుండా కొత్త పెండ్లికూతురును అంతఃపురానికి తీసుకొని వెళ్ళటానికి ఫిరోజిషా మనస్సు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడేవస్తానని చెప్పి ఆమెను, గుర్రాన్ని అక్కడి తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు.
నవాబు సంతోషానికి మేరలేక పోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈసంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి “మిమ్ము ఈ గుర్రంమీద అంతఃపురానికి తీసుకొని రమన్నారు.” అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రమెక్కి ఆతని వెనుక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచి పోయింది.
మేళతాళాలతో రాజపుత్రికి ఎదురుకోలు ఇవ్వడానికి వచ్చిన సపరివారం జరిగిన మోసం తెలుసుకొన్నది. ఈ వార్త విని ఫిరోజిషా దిగాలుపడ్డాడు. రాజపుత్రి లేక, తాను బ్రతకడం కల్ల అనుకొన్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలి నడకన బయలుదేరాడు.

శిల్పి ఎక్కిన గుర్రం పోయిపోయి. గ్రీసు దేశంలో ఒక మైదానంమీద దిగింది. రాజకుమారి శిల్పిచేసిన మోసం తెలుసుకొని ఏడవ సాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసు రాజు చెవులబడింది. అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రివల్ల విని శిల్పితల నరికి వేశాడు.
గ్రీసురాజుకుకూడా వంగరాజ పుత్రిమీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టంలేదు. రాజు బలాత్కారంనుంచి తప్పుకోటానికి పిచ్చిఎత్తినట్టు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్ళను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమెపిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులిప్పించాడు. లాభంలేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి.
ఇక్కడ యిలా జరుగుతూవుండగా అక్కడ పర్షియాలో కాలినడకన బయలుదేరిన ఫిరోజిషా ఊళ్ళు దాటాడు, ఉకాలు దాటాడు. చీమలు దూరని చిట్టడవీ, కాకులు దూరని కారడవీ దాటాడు. ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకొన్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు,
ఫిరోజిషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్లి “నాకు భూతవైద్యం తెలును. రాజపుత్రి పిచ్చి కుదురుస్తా” నన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్లాడు. కొత్త వైద్యుణ్ణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది.
“రాజా, ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వెయ్యాలి. మంత్రాలు చదవాలి. అప్పుడుగాని ఈవ్యాధి పూర్తిగ పోదు, పదియేళ్ళు గడువిస్తే కీలుగుర్రం చేస్తాను,” అన్నాడు ఫిరోజిషా.
“ఈ భాగ్యానికి పది సంవత్సరాలెందుకు. మనదగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది. దానితో చికిత్స చెయ్యి,” అన్నాడు రాజు.
ఫిరోజిషా పొచిక పారింది. రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తానుకూడా. కీలుగుర్రం పై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయు వేగంతో కీలుగుర్రం ఆకాళంలోకి ఎగిరి పోయింది.
ఫిరోజిషా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికివచ్చి చేరాడు. వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది. పెండ్లి నాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళకష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్ళు బ్రతికారు

Appeared in July 1947 edition of Chandamama.